వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులనే గెలిపించాలి
- కోడూరి చంద్రయ్య పిలుపు
మంచిర్యాల జిల్లా, ఖానాపూర్ ఆర్సీ, జనవరి 06:
బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు కోడూరి చంద్రయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సరైన పద్ధతిలో ప్రవేశపెట్టకపోవడం, షెడ్యూల్–9లో బీసీ బిల్లును చేర్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుని బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రయత్నించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలను రిజర్వేషన్లు లేకుండానే నిర్వహించడం ద్వారా బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అయినప్పటికీ బీసీ సమాజం చైతన్యవంతమై సుమారు 50 శాతం వరకు బీసీ సర్పంచులు, వార్డు మెంబర్లను గెలిపించుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను అన్ని జనరల్ నియోజకవర్గాల్లో ఓడించి, బీసీ అభ్యర్థులను గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీసీ కులాలవారు ఐక్యమత్యంతో ఉద్యమంలో పాల్గొని రిజర్వేషన్ల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ కులాలను అగ్రవర్ణాల ఆధిపత్యం ద్వారా నిరంతరం అణిచివేస్తూ, రిజర్వేషన్లు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల విజయంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రకటించడానికి వెనుకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. ఇది బీసీ సమాజం సాధించిన విజయం అని ఆయన అన్నారు.
ఈ ఐక్యమత్యం, చైతన్యాన్ని కొనసాగిస్తూ అగ్రవర్ణాల అణచివేత ధోరణిని తిప్పికొట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో–కన్వీనర్ కడార్ల నరసయ్య, జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్, పొనకల్ గ్రామ వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్, వడ్డెర సంఘం నాయకుడు కుంట సాలయ్య, రిటైర్డ్ టీచర్ సీలోజు రాజబాబు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కంచి నరసయ్య, కట్ట వెంకటేశ్వర్లు, శ్రీరాముల ఆంజనేయులు, మైనారిటీ నాయకుడు షేక్ మజార్ తదితరులు పాల్గొన్నారు.